తమిళనాట రజనీకాంత్ అభిమానులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రకటన ఎట్టకేలకు వెలువడింది. జనవరిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తలైవా ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనలో ‘‘ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’’ అన్న వాక్యం తలైవా ఆలోచన తీరును స్పష్టంగా చెబుతోంది. తలైవా స్వయంగా ఎన్నికల బరిలో ఉంటారా.. లేకపోతే పార్టీకే పరిమితమై చక్రం తిప్పుతారా అనేది వేచిచూడాలి.
69ఏళ్ల రజనీ కాంత్ వచ్చే ఏడాది మేలో జరిగే ఎన్నికల్లో నిలబడకపోతే మరో ఎన్నికలు వచ్చే సమయానికి ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. వయోభారం రీత్యా అప్పటికి ప్రచారం వంటివి కొంత కష్టం అవుతాయి. దీంతో రజనీ 2020 ప్రారంభంలోనే రాజకీయాలపై ప్రకటన చేసి రాష్ట్రంలో పర్యటించాలనుకున్నారు. కానీ, కొవిడ్ కారణంగా ఆ ప్రణాళికను పక్కన బెట్టాల్సి వచ్చింది. తాజాగా కొవిడ్ టీకా పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చి దేశంలో కూడా టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఎన్నికలకు సిద్ధం అయ్యేందుకు తలైవాకు కనీసం ఐదు నెలల సమయం లభిస్తుంది. రాజకీయాల్లో గెలిచే ఊపు ఉంటే ఆ మాత్రం సమయం సరిపోతుందన్న విషయం రజనీకి స్పష్టంగా తెలుసు.
తమిళనాట అన్నాదొరై, ఎంజీఆర్ తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారు డీఎంకే నేత కరుణానిధి, ఏఐడీఎంకే నేత జయలలిత మాత్రమే. వారిద్దరు రెండేళ్ల వ్యవధిలో కన్నుమూశారు. డీఎంకేపై కరుణానిధి కుమారుడు స్టాలిన్ పట్టుపెంచుకున్నా.. ఆయనకు అళగిరి రూపంలో ఇంటి పోరు ఉంది. దీనికి తోడు కరుణనిధి స్థాయిలో పాపులారిటీ లేదు. ఇక అన్నాడీఎంకే అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. భాజపా, ఇతర మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్నా.. బలమైన నాయకత్వం మాత్రం లేదు. ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య సఖ్యత అంతంత మాత్రమే. తమిళనాట కరుణానిధి, జయలలిత స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి రజనీకాంత్ మాత్రమే. ఈ రాజకీయ శూన్యత తనకు కలిసి వస్తుందని తలైవా భావిస్తున్నారు.
