ప్యాసింజర్‌ రైళ్లూ 'ప్రైవేట్‌ ' పరం

 ప్యాసింజర్‌ రైళ్లను ప్రైవేట్‌ పరం చేసేందుకు మోడీ సర్కార్‌ సిద్ధమైంది. ఇందుకు అవసరమైన ప్రక్రియను రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రారంభించింది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుండి 'రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌' (ఆర్‌ఎఫ్‌క్యూ) లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు పెట్టుబడులను ఆమోదించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ప్రైవేటు పెట్టుబడులతో ఆధునిక సాధన సంపత్తి, ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సమకూరుతాయని రైల్వే శాఖ తెలిపింది. ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్న 109 మార్గాలను 12 క్లస్టర్లుగా విభజించారు. ఈ 151 ఆధునిక రైళ్లలో అత్యధికం భారత్‌లోనే రూపొందుతాయి. వీటిలో 16 కోచ్‌లు ఉంటాయి. గంటకు 160 కిమీల గరిష్ట వేగంతో వెళ్లేలా ఈ రైళ్లను డిజైన్‌ చేస్తున్నారు. కాగా, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిర్వహణలో 'ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)' భాగస్వామ్యం గత సంవత్సరం ప్రారంభమైన సంగతి తెలిసిందే. లక్నో - ఢిల్లీ మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ఐఆర్‌సీటీసీకి గత సంవత్సరం అనుమతి లభించింది. దీంతోపాటు ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వారణాసి - ఇండోర్‌ మార్గంలో కాశి మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ను, అహ్మదాబాద్‌- ముంబయి మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది.