మార్చి, ఏప్రిల్ నెలల సగటు విద్యుత్తు వినియోగం ఆధారంగా గ్రూప్ టారిఫ్ నిర్ణయించి విద్యుత్శాఖ బిల్లులు వసూలు చేస్తుండటమే దీనికి కారణం. దీనివల్ల మధ్యతరగతి విద్యుత్తు వినియోగదారునిపై ఒకేసారి భారీ భారం పడుతోంది. కరోనా కారణంగా మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్లో తీసే స్పాట్ బిల్లింగ్ను విద్యుత్తు శాఖ నిలిపేసింది. దీంతో విద్యుత్ వినియోగదారులు మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్ నెల వినియోగంతో కలిపి మేలో విద్యుత్తు శాఖ బిల్లులను జారీ చేస్తోంది. దీని ఆధారంగా డిస్కంలు మేలో విద్యుత్తు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, వేసవి కాలం తోడవ్వడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో గృహ విద్యుత్తు వినియోగం పెరిగింది. దీనికి తోడు రెండు నెలల్లో వినియోగించిన మొత్తం యూనిట్లను కలిపి..ఆపై వాటిని సగటు చేయడంతో కేటగిరి మారిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. ఏప్రిల్లో వాస్తవ విద్యుత్తు వినియోగం ఆధారంగా బిల్లులు జారీ చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉండేది కాదని వినియోగదారుల వాదనగా ఉంది.
విద్యుత్తు బిల్లుల షాక్!