పిల్లల ఆరోగ్యం... హెచ్చరించిన యునిసెఫ్‌


కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. రానున్న ఆరునెలల్లో కరోనా ప్రభావం వల్ల ప్రతిరోజూ అంతర్జాతీయంగా ఆరువేల మంది చిన్నారులు మృత్యువాత పడనున్నారని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిసెఫ్‌ హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా మాతా శిశు వైద్యసేవలకు అంతరాయం కలుగుతుందని దీనితో కేవలం ఆరునెలల్లో పన్నెండు లక్షల మరణాలు సంభవించవచ్చని సంస్థ లెక్కకట్టింది. ఐదు సంవత్సరాల లోపు వయసు గల చిన్నారుల మరణరేటులో పెరుగుదల 44.7  శాతం, తల్లుల్లో ఈ రేటు 38.6 శాతం వరకు ఉండవచ్చని... శిశు మరణాలు గరిష్టంగా రోజుకు 1400గా ఉండవచ్చని సంస్థ అంచనా వేసింది.


లాక్‌డౌన్‌ వంటి కొవిడ్‌-19 నిరోధక చర్యల వల్ల వైద్య సదుపాయాలు, పరికరాల కొరత ఏర్పడటంతో చిన్నారులకు వ్యాక్సిన్లు, మహిళలకు ప్రసూతి సేవల అందుబాటులో లేకుండా పోతాయని.. వారు ఆరోగ్య కేంద్రాలను సందర్శించటం ఇప్పటికే పడిపోయిందని వెల్లడించింది.