బంగారం మరి కొనలేం..


దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కోవిడ్‌-19 కేసులు వేగంగా పెరుగుతుండటం, అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ముదరడంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం రూ.606 పెరిగి రూ 47,260కి ఎగబాకింది. వెండి ధరలు సైతం బంగారం బాటలో నడిచాయి. కిలో వెండి రూ 1983 పెరిగి రూ 46118 పలికింది. ఇక అమెరికా-చైనా సంవాదం అంతర్జాతీయ మార్కెట్‌లో స్వర్ణానికి డిమాండ్‌ పెంచుతోంది.


కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనా కారణమని మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బీజింగ్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటామని సంకేతాలు పంపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల పట్ల తనకు ఆసక్తి లేదని చెప్పడంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ తారాస్ధాయికి చేరింది. ట్రంప్‌ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో  మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఈక్విటీ మార్కెట్ల పతనం కూడా పసిడికి డిమాండ్‌ పెంచిందని బులియన్‌ నిపుణులు పేర్కొంటున్నారు.