విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపై పడిపోయారు. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి పోలీసులకు సమాచారమందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని భయంతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలను సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. వెంటనే ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ప్రజలను హెచ్చరించి పరిసర ప్రాంతాల నుంచి వేరే చోటికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని ఆంబులెన్స్లో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్చంద్,విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఎల్జి పాలిమర్స్లో రసాయన గ్యాస్ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్ వినయ్చంద్కు ఫోన్ చేసి ఆరా తీశారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.