జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమల దర్శనానికి రావద్దు...టీటీడీ అధికారుల వినతి


కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమలలోని శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు సలహా ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ వల్ల కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు తమ తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. కరోనావైరస్ లక్షణాలు భక్తుల్లో ఎవరికైనా కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు తరలించాలని ఆలయ అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా భక్తులు సానిటైజర్, మాస్కులు వెంట తీసుకురావాలని టీటీడీ అధికారులు సూచించారు.