చివరి నిమిషంలో ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు మరో ఎత్తు వేశారు. ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలతో దోషుల ఉరిశిక్ష అమలు ఇప్పటికే చివరి నిమిషంలో మూడు పర్యాయాలు వాయిదా పడిన నేపథ్యంలో ఈ అంశం సంచలనంగా మారింది. ఉరి శిక్షపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించారు. అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేశారు.
కొత్త ఆదేశాల ప్రకారం నిర్భయ దోషులను మార్చి 20న ఉరి తీయాల్సి ఉంది. పలు వాయిదాల అనంతరం నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఇటీవల కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది.
నిజానికి నిర్భయ దోషులను జనవరి 22నే ఉరి తీయాల్సి ఉండగా.. న్యాయపరమైన అవకాశాల పేరుతో చివరి నిమిషంలో దోషులు కొత్త పిటిషన్లు, దరఖాస్తులు పెట్టుకోవడంతో మూడు సార్లు ఉరితీత వాయిదా పడింది. దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమకున్న న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధరించాలని కోరుతూ అతడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. అతడి అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 16) కొట్టివేసింది.
సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. నిర్భయ దోషులు ఐసీజేను ఆశ్రయించడంతో ఉరి శిక్ష అమలుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.