దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటన.. రోహిత్ ఔట్, ధావన్, హార్దిక్ రీఎంట్రీ


దక్షిణాఫ్రికాతో మార్చి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు 15 మందితో కూడిన జట్టుని ఆదివారం ప్రకటించారు. గాయం కారణంగా ఇటీవల టీమ్‌కి దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా.. రిజర్వ్ ఓపెనర్‌గా శుభమన్‌ గిల్‌కి అవకాశం దక్కింది. ఇక సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ పిక్క గాయం నుంచి ఇంకా కోలేకోకపోవడంతో అతడ్ని పక్కన పెట్టిన భారత సెలక్టర్లు.. యువ ఓపెనర్ పృథ్వీ షాకి మరో అవకాశం ఇచ్చారు. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో వన్డే, టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన పృథ్వీ షా అంచనాల్ని అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సిరీస్‌లో పృథ్వీ షాతో కలిసి ఓపెనర్‌గా ఆడిన మయాంక్ అగర్వాల్ ఫెయిలవడంతో అతడ్ని తప్పించిన సెలక్టర్లు.. శిఖర్ ధావన్‌కి చోటిచ్చారు. ఇటీవల డీవై పాటిల్ టీ20 కప్‌లో మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్య, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌లు ఫిట్‌నెస్ నిరూపించుకున్నారు.