కరోనాను మించి వ్యాప్తి చెందుతున్న వదంతులు... 27 మంది మృతి!


టెహ్రాన్: కరోనా వైరస్ ఇప్పటి వరకూ వంద దేశాలకు పైగా పాకిపోయింది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్‌కు మించి దీనికి సంబంధించిన వదంతులు మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇటువంటి వదంతుల కారణంగా ఇరాన్‌లో ఇప్పటిరకూ 27 మంది మృతి చెందారు. ఇరాన్‌లోకి ప్రవేశించిన కరోనా వైరస్ 5 వేల మందికి సోకింది. ఈ నేపధ్యంలో ఇరాన్‌లోని స్కూళ్లు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.  అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలను రద్దుచేశారు. చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ ప్రమాదకర వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి సోకింది. మూడు వేలకు మించిన వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇరాన్‌లో  ఆల్కహాల్ తాగడం ద్వారా కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చనే వదంతి వ్యాప్తి చెందింది. ఇరాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు చాలామంది మిథనాల్ తాగారు. ఈ కారణంగా 27 మంది మృత్యువాత పడ్డారు. అధిక మోతాదులో మిథనాల్‌ను తీసుకుంటే కంటి చూపు మందగించడంతోపాటు, లివర్ దెబ్బతిని మరణించే అవకాశాలున్నాయి.