బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి దిమ్మతిరిగే షాక్. బంగారం ధర ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. ఆకాశాన్ని తాకింది. కొండెక్కిన కూర్చున్న బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయాలంటే మాత్రం సామాన్యులకు చుక్కలు కనిపిస్తాయి. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది.
కరోనా ఎఫెక్ట్..
బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్మెంట్ సాధనమైన బంగారానికి ఫుడ్ డిమాండ్ ఏర్పడింది. దీంతో పసిడి ధర గ్లోబల్ మార్కెట్లో పరుగులు పెడుతూ దూసుకెళ్తోంది. దీంతో మన మార్కెట్లోనూ పసిడి ధర పైపైకి కదిలింది. ఇకపోతే మన దేశంలోనూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
పసిడికి కలిసొచ్చిన రూపాయి పతనం
కేవలం కరోనా వైరస్ వల్ల మాత్రమే కాకుండా బంగారం ధర పరుగుకు మరో కారణం కూడా ఉంది. అదే రూపాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో రూపాయి కూడా ఎఫెక్ట్ పడింది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడుతూ వస్తోంది. ఇంకా 73 మార్క్ కిందనే కదలాడుతోంది. రూపాయి బలహీనపడటం వల్ల బంగారం దిగుమతుల భారం పెరుగుతుంది. దీంతో ధర పెరుగుతుంది.
రూ.1500 జంప్
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. ఒకేరోజులో రూ.1520 మేర పరుగులు పెట్టింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,790 నుంచి రూ.45,310కు చేరింది. అంటే పసిడి ధర రూ.45 వేల మార్క్ పైకి చేరిందని చెప్పుకోవచ్చు.
22 క్యారెట్ల బంగారం ఇలా
అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. ఇది కూడా రూ.1390 మేర పెరిగింది. దీంతో ధర రూ.40,140 నుంచి రూ.41,530కు చేరింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
4 రోజులుగా పైకే
దేశీ మార్కెట్లో బంగారం ధర గత నాలుగు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ నాలుగు రోజుల్లో ఏకంగా రూ.1670 పెరిగింది. అదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాములకు రూ.1650 మేర ర్యాలీ చేసింది.
వెండి జిగేల్
పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1330 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,700 నుంచి రూ.50,030కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
గ్లోబల్ మార్కెట్లో పసిడి ధగధగ
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. 1650 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. బంగారం ధర ఔన్స్కు 0.06 శాతం పెరుగుదలతో 1644.35 డాలర్లకు పరుగులు పెట్టింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్కు ఏకంగా 0.29 శాతం పెరుగుదలతో 17.23 డాలర్లకు చేరింది.
విశాఖ, విజయవాడలో ధరలు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1390 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,530కు చేరింది. వెండి ధర కూడా రూ.1330 పెరుగుదలతో రూ.50,030కు పరుగులు పెట్టింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో పసిడి రేట్లు
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెట్టింది. ఏకంగా రూ.1400 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1400 పెరుగుదలతో రూ.41,000 నుంచి రూ.42,400కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1400 పెరుగుదలతో రూ.42,200 నుంచి రూ.43,600కు ఎగసింది. ఇక వెండి ధర కూడా రూ.1330 పెరుగుదలతో రూ.50,030కు చేరింది.
8 శాతం పరుగు
గతేడాదిలో బంగారం ధర ఏకంగా 25 శాతం మేర పరుగులు పెట్టింది. ఇప్పుడు పుత్తడి ఈ కొత్త ఏడాదిలోనూ దూకుడు కనబరుస్తోంది. బంగారం ధర 2020 ఆరంభం నుంచే పరుగులు పెడుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 8 శాతం మేర పెరిగింది. దేశీ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వెండి ధర కూడా వెలిగిపోతోంది. దేశీ మార్కెట్లో డిమాండ్ పెరుగుదల సహా అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటంతో బంగారం ధర పైపైకి కదులుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
పసిడి ధరపై వీటి ప్రభావం
పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.